ZHUROUNG ROVER: మార్స్ గ్రహంపై దిగిన చైనా రోవర్.. అమెరికా సరసన చేరిన డ్రాగన్ కంట్రీ

స్పేస్ పరిశోధనలో చైనా మరో కీలక ముందడుగు వేసింది. డ్రాగన్ దేశానికి చెందిన జురాంగ్ రోవర్.. మార్స్ గ్రహంపై దిగింది. ఆరు చక్రాలు ఉన్న ఈ మిషన్ ను విజయవంతంగా దించినట్లు చైనా వెల్లడించింది. అంగారక గ్రహంపై ఉన్న ఉతోపియా శ్రేణులను టార్గెట్ చేస్తూ ఈ రోవర్ను లాంచ్ చేశారు. ఉత్తర ద్రువం దగ్గర ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో రోవర్ను ల్యాండ్ చేయడం అసాధారణమని చైనా పరిశోధకులు వెల్లడించారు. ఇప్పటి వరకు కేవలం అమెరికా మాత్రమే మార్స్ గ్రహంపై తన రోవర్ను ల్యాండ్ చేసింది. తాజాగా అమెరికా సరసన చైనా చేరింది.
మార్స్ గ్రహంపై వెళ్లేందుకు ప్రయత్నించిన అన్ని దేశాలు ఇప్పటి వరకు విఫలం అయ్యాయి. ఆ గ్రహం సమీపానికి వెళ్లిన తర్వాత పలు దేశాల రోవర్లు క్రాష్ లాండ్ అయ్యాయి. కొన్ని కాంటాక్ట్ లేకుండా పోయాయి. జురాంగ్ రోవర్ విజయవంతంగా దిగిన సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఆ మిషన్ బృందాన్ని అభినందించారు. వారి అద్భుత పనితీరుపై ప్రశంసలు కురిపించారు.
బీజింగ్ కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 7.18 నిమిషాలకు రోవర్ ల్యాండ్ అయ్యింది. రోవర్ దిగిన 17 నిమిషాల తర్వాత దాని సోలార్ ప్యానెల్స్ తెరుచుకున్నాయి. ఆ తర్వాత అది భూమికి సిగ్నల్స్ పంపింది. చైనా భాషలో జురాంగ్ అంటే అగ్ని దేవుడు. అయితే జురాంగ్ రోవర్ను.. తియాన్వెన్-1 ఆర్బిటార్లో తీసుకువెళ్లారు. ఫిబ్రవరిలో దాన్ని ప్రయోగించారు. మార్స్ మీద ఉటోపియా ప్రాంతంలో రోవర్ను దించేందుకు తొలుత శాస్త్రవేత్తలు హై రెజల్యూషన్ చిత్రాలను తీశారు. ఆ తర్వాత సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఈ ప్రయోగంతో చైనా సరికొత్త రికార్డు సాధించింది. గతంలో మార్స్ పై మిషన్ చేపట్టిన భారత్ ల్యాండింగ్ సమయంలో విఫలం అయ్యింది.