Demonetisation: పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని కొట్టివేయలేం, సుప్రీంకోర్టు సంచనల తీర్పు

పెద్ద నోట్లు రద్దు అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. డీమానటైజేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను ధర్మాసనం సమర్థించింది. ఈ మేరకు జస్టిస్ ఎన్.ఎ.నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. 2016 నవంబర్ 8 నోటిఫికేషన్ చెల్లుబాటు అవుతుందని తేల్చి చెప్పింది. కాగా, పెద్దనోట్ల రద్దును ధర్మాసనంలోని నలుగురు సభ్యులు సమర్థించగా ఒకరు తప్పుబట్టారు.
నోట్ల రద్దును నిర్ణయాన్ని కొట్టివేయలేం- సుప్రీంకోర్టు
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఆధారంగా నోట్ల రద్దును నిర్ణయాన్ని కొట్టివేయలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. నోట్ల రద్దు వెనుక మూడు లక్ష్యాలను గుర్తించినట్లు వివరించింది. సదరు లక్ష్యాలను చేరుకోవడంలో మాత్రం కొన్ని తేడాలు కనిపించినట్లు వెల్లడించింది. వాటిని బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వ చర్యలను కొట్టిపారేయలేమని చెప్పారు.
ఒకరు అనుకూలం, మరొకరు వ్యతిరేకం
పెద్దనోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా కనిపించడం లేదని జస్టిస్ గవాయ్ తేల్చి చెప్పారు. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య పలు మార్లు సంప్రదింపులు జరిగిన తర్వాతే ఈ నిర్ణం తీసుకున్నట్లు వెల్లడించారు. అటు పెద్దనోట్ల రద్దు అంశంలో కేంద్రం వైఖరిని జస్టిస్ నాగరత్న తప్పుపట్టారు. నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కాకుండా ప్లీనరీ చట్టం రూపంలో నిర్ణయం ప్రకటించి ఉంటే బాగుండేదని తేల్చి చెప్పారు. వాస్తవానికి ఈ చర్యను మంచి ఉద్దేశంతోనే చేపట్టారు. ముఖ్యంగా బ్లాక్ మనీ, టెర్రర్ ఫండింగ్, దొంగనోట్లను లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నారు. కానీ, ఆ లక్ష్యాలను పూర్తి స్థాయిలో ఫోకస్ చేయకుండా చట్ట విరుద్దంగా తీసుకున్న చర్యగా అభివర్ణించారు. 2016లో వెలువడిన ఈ నోటిఫికేషన్ మీద ఇప్పుడు స్టే ఇవ్వలేమని చెప్పారు. అటు నోట్ల రద్దు ఇప్పటికే జరిగిపోయిందని వివరించింది. ఈ నేపథ్యంలో పిటిషనర్లకు ఎటువంటి ఉపశమనం కలిగించలేమని జస్టిస్ నాగరత్న తెలిపారు.
పెద్దనోట్ల రద్దుపై సుప్రీం కీలక తీర్పు
పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన సుమారు 58 పిటీషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. 2016లో కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు పిటీషన్లు దాఖలయ్యాయి. వాటిని మీద విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించిన రికార్డులను అందజేయాలని కేంద్ర ప్రభుత్వం తోపాటు ఆర్బీఐని గత డిసెంబర్ లో ఆదేశించింది. జస్టిస్ ఎస్.ఎ.నజీర్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ పూర్తి చేసి తీర్పును ఇవాళ్టికి రిజర్వు చేసింది. ఈ అంశంపై ఇవాళ తుది తీర్పు వెలువడింది.
రాహుల్ గాంధీ క్షమాపణ చెప్తారా?
అటు పెద్ద నోట్ల రద్దు విషయం కేంద్ర ప్రభుత్వం చర్యలను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. దేశ ప్రయోజనాల కోసం సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుగా ఆ పార్టీ అభివర్ణించింది. పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పుడు క్షమాపణ చెప్తారా? అని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రశ్నించారు.