కరోనా కట్టడిలో 5 బెస్ట్, 5 వరస్ట్ దేశాలు ఇవే.. ఇంతకీ భారత్ బెస్టా? వరస్టా?

ఏడాదిన్నర నుంచి ప్రపంచాన్నికరోనా మహమ్మారి గడగడ వణికిస్తుంది. చైనాలోని వ్యూహాన్ లో ప్రాణం పోసుకున్న ఈ వైరస్.. కొద్ది రోజుల్లోనే ప్రపంచం అంతటికీ వ్యాపించింది. కరోనా ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. వైరస్ దెబ్బకు అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్, బ్రిజిల్, ఇటలీ సహా పలు దేశాలు అతలాకుతలం అయ్యాయి. భారత్ పరిస్థితి దారుణంగా తయారైంది. మొదటి దశను కట్టడి చేసిన ఆయా దేశాలు.. రెండోదశలో చతికిలపడ్డాలి. కొన్ని దేశాలు కరోనాను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యాయి. కఠిన చర్యలతో వైరస్ను కట్టడిచేసి ప్రపంచ దేశాలకు రోల్ మోడల్ గా నిలిచాయి. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయలేక పూర్తిగా విఫలమైన దేశాలు సైతం మరికొన్ని ఉన్నాయి. ఇంతకీ కరోనా కట్టడిలో 5 బెస్ట్.. 5 వరస్ట్ దేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
కరోనా కట్టడిలో 5 బెస్ట్ దేశాలుః
తైవాన్
కరోనా వ్యాప్తిని కట్టడిలో ప్రపంచ దేశాలకు తైవాన్ ఆదర్శంగా నిలిచింది. చైనాకు ఈ దేశం దగ్గరగా ఉంది. జనాభా 2.3కోట్లు. ఇప్పటి వరకు అక్కడ కేవలం 1,153 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇందులో 12 మంది మృతి చెందారు. వ్యూహాన్ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులను తైవాన్ క్వారంటైన్ చేసింది. అనంతరం దేశంలో రోగులను ట్రేసింగ్ పద్దతిలో గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకుంది. దీంతో గత 200 రోజులుగా అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. పాజిటివ్ వచ్చిన వారిని హోటళ్లలో ఉంచుతూ వైరస్ వ్యాప్తిని అరికడుతోంది.
న్యూజిలాండ్
కోవిడ్ కట్టడికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుని మహమ్మారిపై విజయం సాధించింది న్యూజిలాండ్. ఇప్పటి వరకు అక్కడ కేవలం 2,629 పాజిటివ్ కేసుల, 26 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. దేశంలో తొలి 100 కేసులు నమోదైన వెంటనే మార్చి 26, 2020 న దేశ వ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ విధించింది. ప్రస్తుతం కొత్త కేసులు లేనప్పటికీ విదేశాల నుంచి వచ్చే వారిలో పాజిటివ్ వస్తున్నట్లు అక్కడి సర్కారు తెలిపింది.
ఐస్లాండ్
కేవలం 3, 64,000 జనాభా ఉన్న ఐస్లాండ్ కూడా వైరస్ వ్యాప్తి కట్టడిలో ముందడుగు వేసింది. ఎలాంటి లాక్డౌన్ అమలు చేయకుండా కేవలం ముందస్తు ప్రణాళికతో మహమ్మారిని సమర్థవంతంగా కట్టడి చేసింది. ఇప్పటివరకు ఆ దేశంలో కేవలం 6,491 పాజిటివ్ కేసులు, 29 మరణాలు మాత్రమే సంభవించాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా పాజిటివ్ వచ్చిన వారిని ఇళ్లలోనే ఉంచింది. అక్కడే చికిత్స అందించింది.
సింగపూర్
కోవిడ్-19ను సమర్థవంతంగా కట్టడి చేయడంలో సక్సెస్ అయిన మరో దేశం సింగపూర్. సరైన ప్రణాళిక, భారీ స్థాయిలో కొవిడ్ పరీక్షలు, సరిహద్దులపై ఆంక్షలు విధించడం, క్వారంటైన్ నిబంధనలు కఠినంగా అమలుచేయడంతో మహమ్మారిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చింది. ఆదేశంలో 61,252 కేసులు నమోదు కాగా, ఇందులో 31 మంది చనిపోయారు. అటు వ్యాక్సినేషన్లో సింగపూర్ దూసుకెళ్తోంది.
వియత్నాం
కరోనా వైరస్ కట్టడిలో వియత్నాం సక్సెస్ అయ్యింది. జనవరి 30, 2020న తొలి కేసు నమోదైన వెంటనే పక్కా ప్రణాళికను రూపొందించుకుంది. ముందుజాగ్రత్తగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. విదేశీ పర్యాటకులను అక్కడ నుంచి వెనక్కి పంపింది. కొన్నిరోజుల పాటు దేశవ్యాప్తంగా పూర్తి లాక్డౌన్ విధించింది. ఇప్పటి వరకు అక్కడ కేవలం 2,995 కేసులు నమోదయ్యాయి. 35 మంది మరణించారు.
కరోనా కట్టడిలో 5 వరస్ట్ దేశాలుః
అమెరికా
అమెరికాలో వైరస్ విజృంభించడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే చర్యలే ప్రధాన కారణం. వైద్య నిపుణులు హెచ్చరించిన ఆయన పట్టించుకోలేదు. ఇప్పటివరకు యూఎస్లో 3.25 కోట్ల మంది వైరస్ బారిన పడగా, 5.78 లక్షల మరణాలు సంభవించాయి. ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలు నమోదైంది అమెరికాలోనే. అనంతరం జో బైడెన్ ప్రభుత్వం తీసుకున్న కఠిన ఆంక్షల వల్ల వైరస్ కొద్దిగా తగ్గుముఖం పట్టింది.
బ్రెజిల్
కరోనా కట్టడిలో ఘోరంగా విఫలమైన దేశాల్లో బ్రెజిల్ కూడా ఉంది. 4 లక్షలకు పైగా మంది మహమ్మారికి బలయ్యారు. ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో సైతం వైరస్ను తేలికగా తీసుకున్నారు. వైరస్ కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో మహమ్మారి మరింత విజృంభించి భారీగా ప్రాణాలు తీసింది. శవాలను పూడ్చి పెట్టేందుకు స్థలం దొరకని పరిస్థితులు తలెత్తాయి.
భారత్
మొదట కరోనా కట్టడికి బాగానే స్పందించిన భారత్, ఆ తర్వాత నిర్లక్ష్యం వహించడంతో ఇప్పుడు సెకండ్ వేవ్ బారినపడి విలవిల్లాడుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రెండు కోట్లకు పైగా మందికి వైరస్ సోకగా, 2.26 లక్షల మందిని మహమ్మారి కబళించింది. మార్చి 24 నుంచి మే 31 వరకు మోదీ సర్కార్ దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. మహమ్మారి అదుపులోకి వచ్చింది. ఆ తర్వాత ఆంక్షలను సడలించడం, జనాలు వైరస్ను తేలికగా తీసుకోవడంతో మళ్లీ మహమ్మారి పంజా విసిరింది. ప్రస్తుతం దేశంలో రోజు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతుంటే.. మరణాలు మూడు వేలకు పైగానే సంభవిస్తున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు దొరకని పరిస్థితి నెలకొంది.
మెక్సికో
కరోనావైరస్ కట్టడిలో ఘోరంగా విఫలమైన దేశాల జాబితాలో మెక్సికో కూడా ఉంది. ఇప్పటి వరకు మెక్సికోలో 2.17 లక్షల మంది వైరస్కు బలయ్యారు. 2.35 మిలియన్ల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ వైరస్ ఇంతలా విజృంభించడానికి ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెస్ నిర్లక్ష్యమే కారణం. వైరస్ ఉధృతి కొనసాగుతున్న వేళ కూడా దేశ సరిహద్దులను మూసివేయలేదు. అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించలేదు. మార్చి 30న లాక్డౌన్ విధించారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
బ్రిటన్
యూకేలో లాక్డౌన్ విషయంలో ప్రధాని బోరిస్ జాన్సన్ త్వరగా నిర్ణయం తీసుకోకపోవడంతో వైరస్ మరింత విజృంభించింది. యూకేలో ఇప్పటి వరకు 1.27 లక్షల మంది కరోనాతో మరణించారు. అలాగే 4.44 మిలియన్ల మంది వైరస్ బారిన పడ్డారు. లాక్డౌన్పై త్వరగా నిర్ణయం తీసుకోకపోవడంలో బోరిస్ జాన్సన్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. దీంతో భారీ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదయ్యాయి.