UPI Transactions: రికార్డు స్థాయిలో UPI పేమెంట్స్, 2022 డిసెంబర్ లో రూ.12 లక్షల కోట్లు దాటిన లావాదేవీలు

దేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) వినియోగం సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. 2022 డిసెంబర్లో ఏకంగా రూ.12.82 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. వినియోగదారులు 782 కోట్లకు పైగా లావాదేవీలను జరిపారు. 2016లో UPI సేవలు మొదలు కాగా, ఇప్పటి వరకు డిసెంబర్ లోనే అత్యధిక చెల్లింపులు జరిగాయి.
డిజిటల్ చెల్లింపుల విప్లవంలో UPI కీలక పాత్ర
2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా UPI సేవలు మొదలయ్యాయి. దేశంలో డిజిటల్ చెల్లింపులు ఊపందుకోవడంలో UPI కీలకపాత్ర పోషించింది. 2016 నుంచి నెల నెలకు డిజిటల్ చెల్లింపులు పెరుగుతూనే వస్తున్నాయి. గత డిసెంబర్ లో మాత్రం సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. UPI ద్వారా చెల్లింపులు గత ఏడాది అక్టోబర్లో రూ. 12 లక్షల కోట్ల మార్కును క్రాస్ చేశాయి. నవంబర్ లో UPI ద్వారా రూ.11.90 లక్షల కోట్ల విలువైన 730.9 కోట్ల లావాదేవీలు జరిగాయి. తాజాగా ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. “దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవాన్ని తీసుకురావడంలో యూపీఐ ఎనలేని సహకారం అందించింది. డిసెంబర్ 2022లో యూపీఐ చెల్లింపులు రూ. 12.82 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 782 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి” అని వివరించింది.
దేశ వ్యాప్తంగా UPI సేవలు అందిస్తున్న 381 బ్యాంకులు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 381 బ్యాంకులు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) సేవలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖాతాదారులు బ్యాంకుకు వెళ్లే పని లేకుండా వీలైనంత వరకు పూర్తి స్థాయి చెల్లింపులు UPI ద్వారానే చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నెల నెలకు UPI చెల్లింపులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అంతేకాదు, ఫోన్ ద్వారా రియల్ టైంలో జరిగే UPI చెల్లింపులు చాలా సేఫ్ గా ఉంటాయి. అత్యంత ఈజీగా చెల్లింపులు జరిపే అవకాశం ఉంటుంది. అదనపు ఛార్జీలు కూడా లేవు. ఈ నేపథ్యంలోనే UPI చెల్లింపులకు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు.
3 ఏండ్లలో 8.60 శాతం పెరిగిన UPI చెల్లింపులు
దేశ వ్యాప్తంగా UPI చెల్లింపులు 3 సంవత్సరాల వ్యవధిలో 8.60 శాతం పెరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన డేటా ప్రకారం, నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో లావాదేవీల సంఖ్య 7.12 శాతం పెరిగింది. దే సమయంలో లావాదేవీల విలువ 7.73 శాతం పెరిగింది. అంతకుముందు జూలై 2022లో, UPI మొదటిసారిగా 6 బిలియన్ల లావాదేవీల మార్కును తాకింది. రూ. 10.62 లక్షల కోట్ల విలువైన 6.28 బిలియన్ లావాదేవీలను నమోదు చేసింది. UPI సేవలు 2016లో మొదలు కాగా, మూడు సంవత్సరాల తర్వాత, అంటే అక్టోబర్ 2019లో మొదటిసారిగా 1 బిలియన్ లావాదేవీల మార్కు క్రాస్ చేసింది. 2022 క్యాలెండర్ సంవత్సరంలో, UPI 125.94 ట్రిలియన్ల విలువైన 74 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసినట్లు NPCI వెల్లడించింది.
P2M లావాదేవీల్లో గణనీయమైన వృద్ధి
UPI ప్రారంభంలో ఎక్కువగా P2P(వ్యక్తి-వ్యక్తి) లావాదేవీలు ఎక్కువగా జరిగాయి. అయితే, గత కొద్ది సంవత్సరాల్లో P2M(వ్యక్తి నుంచి వ్యాపారి) లావాదేవీలల్లో గణనీయమైన మార్పు కనిపించింది. వాల్యూమ్ పరంగా P2M లావాదేవీల ఇప్పుడు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి.